శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకుడు. అదితిరావ్హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అక్టోబర్ 14న ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కొత్త పోస్టర్ను విడుదలచేసింది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ ఒకరిపై మరొకరు తుపాకులు ఎక్కుపెట్టి కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమ, యాక్షన్ హంగుల కలబోతగా రూపొందుతున్న చిత్రమిది. ఇద్దరు యువకుల జీవనగమనంలో ఎదురైన సంఘటనలేమిటి? ప్రాణ స్నేహితులుగా ఉన్న వారు ఎందుకు శత్రువులుగా మారారన్నది ఆకట్టుకుంటుంది. శర్వానంద్, సిద్ధార్థ్ పాత్రలు మాస్ పంథాలో విభిన్నంగా ఉంటాయి’ అని తెలిపారు. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: రాజ్ తోట.