Pathan Controversy | బాలీవుడ్ బాద్షా సినిమా పఠాన్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్నది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణె జంటగా నటించిన చిత్రంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే హిందూ సంఘాలు ‘పఠాన్’ మూవీపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఉలేమా బోర్డు సైతం సినిమాతో పాటు సాంగ్పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. సినిమాను విడుదల చేయొద్దని డిమాండ్ చేసింది.
‘పఠాన్’ చిత్రంపై మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్రానికి సంబంధించి అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. సినిమా ద్వారా అసభ్యతను ప్రచారం చేస్తున్నారని, ఇస్లా మతంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఆలిండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ ఈ చిత్రానికి సంబంధించి స్టాండ్ తీసుకుని బహిష్కరించాలన్నారు. సినిమాను చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సినిమా అసలు విడుదల కానివ్వొద్దంటూ సెన్సార్ బోర్డును కోరారు. ఇస్లాంపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఈ విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించనివ్వొద్దని థియేటర్ల యాజమాన్యాలకు, చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్పై అయ్యద్ అనాస్ అలీ మండిపడ్డారు. నటుడు తన పేరును షారుఖ్ ఖాన్ అని చెప్పుకుంటాడని, ఇస్లాం, ముస్లింలను ఎగతాళి చేసే సినిమాలు తీస్తాడని విమర్శించారు. పఠాన్లు గౌరవ ప్రదమైన సమాజమని, కానీ సినిమాలో వారిని తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక నుంచి ఉమ్రాకు వెళ్లేందుకు కూడా షారూక్కి వీసా ఇవ్వొద్దని హజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్నారు.