రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మా నాన్న నక్సలైట్’. ఈ చిత్రాన్ని చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు పి సునీల్కుమార్ రెడ్డి. అజయ్, సుబ్బరాజు, జీవ, ఎల్బీ శ్రీరామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పి సునీల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ..‘నక్సలిజం అనే నేపథ్యాన్ని పెట్టుకుని రూపొందించిన తండ్రీ కొడుకుల కథ ఇది. ఇందులోని సెంటిమెంట్, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అన్నారు. ‘సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది. భవిష్యత్లోనూ ఇలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఇందులో తండ్రీ కొడుకు మధ్య సాగే భావోద్వేగాలు ఆర్థ్రతకు గురి చేస్తాయి’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్కుమార్ పాల్గొన్నారు.