‘ఖుషి’ తర్వాత కథానాయికగా తెలుగు తెరపై కనిపించలేదు సమంత. ఆ మధ్య ‘శుభం’ సినిమాలో మాత్రం అతిధి పాత్రలో మెరిశారు. కథానాయికగా సామ్ ఇంత గ్యాప్ తీసుకోవడం ఆమె అభిమానులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తానే స్వయంగా నిర్మిస్తూ, నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల తేదీని సమంత ప్రకటించారు. మే 15న ఈ సినిమా విడుదల కానుంది. నందినిరెడ్డి దర్శకత్వంలో ట్రలాలా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.
దానికి ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఓ కారణం. కుటుంబ సాంప్రదాయాలకు విలువనిచ్చే కోడలిగా ఓ వైపు అమాయకంగా కనిపిస్తూనే, మరోవైపు యాక్షన్ మోడ్లో అదరగొట్టారు సమంత. ఈ టీజర్ చూసిన వారంతా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆతృతగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.