‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేం గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘మా బావ మనోభావాలు’ సాంగ్ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాలయ్య ఊరమాస్ స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ ఏజ్లో కూడా అలాంటి స్టెప్స్ బాలయ్యకే సాధ్యం అనేంతలా వీర లెవల్లో రెచ్చిపోయాడు. మాములుగానే బాలయ్య పాటలు మాస్గా ఉంటాయి. కాగా ఈ పాట ఊరమాస్ లెవల్లో ఉంది. పైసా వసూల్ పాట తర్వాత అంతటి ఎనర్జీ ఈ పాటలో కనిపించింది. థమన్ మరోసారి తనలోని మాస్ను బయటకు తీశాడు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్లు ఆలపించారు. ఇప్పటి వరకు రిలీజైన అన్ని పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ సంస్థ నిర్మించింది. బాలయ్య ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్న ‘వాల్తేరు వీరయ్య’ను కూడా మైత్రీ సంస్థే నిర్మించింది. ఇన్నేళ్ళ సినీ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారిగా ఒకే బ్యానర్లో తెరకెక్కిన సినిమాలు ఒకటి, రెండు రోజుల గ్యాప్లో రిలీజవడం ఇదే మొదటి సారి. మరీ మైత్రీకి ఈ రెండు సినిమాలు కలిసి వస్తాయో లేదో చూడాలి.