అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Moteve For Murder). ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సీనియర్ దర్శకుడు సముద్ర.వి ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటిస్తున్నాం. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోనుచేసే యూనివర్సల్ సబ్జెక్ట్’ అని మోహన్ వడ్లపట్ల తెలిపారు. ఇంకా కథానాయిక జో శర్మ, నటుడు ఎంఆర్సీ వడ్లపట్ల, TFDA సెక్రటరీ పెండ్యాల కూడా మాట్లాడారు.