‘వెంకటేష్ నాకు చాలా ఇష్టమైన హీరో. ఆయన 75వ చిత్రాన్ని నిర్మించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు . నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకటేష్ కథానాయకుడిగా ఆయన రూపొందించిన చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటించారు.. వెంకటేష్తో సినిమా చేయాలన్న నా కల ఈ సినిమాతో తీరింది.
కథ చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ‘ఇదంతా డెస్టినీ’ అని వెంకటేష్ నాతో చెప్పారు. న్యూ ఏజ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇది. కథలో భావోద్వేగాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సినిమా అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు శైలేష్ కొలను యాక్షన్, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా తీశాడు. వెంకటేష్ తన పాత్రలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. సంతోష్ నారాయణ్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది.
ఈ కథ స్పాన్ చాలా పెద్దది. అందుకే నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా వంటి స్టార్స్ను తీసుకున్నాం. ప్రొడక్షన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. నాని మా సంస్థలో రెండు సినిమాలు చేసి నాకు నిర్మాతగా గుర్తింపును తీసుకొచ్చారు. నాని లాగానే వెంకటేష్ కూడా బాగా ఇష్టం. వారిద్దరితో మల్టీస్టారర్ సినిమా చేయాలన్నది నా డ్రీమ్. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నా.