కరోనా మహమ్మారి సినిమా నిర్మాతల ప్లానింగ్స్ మొత్తం మార్చేసింది. తమ సినిమాలని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉండగా, కరోనా వలన అంతా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్స్టోరీ’ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని అప్పట్లో ప్రచారం జరిగిన మేకర్స్ దీనిని ఖండించారు.
జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉండగా, లవ్ స్టోరీ మేకర్స్ తమ చిత్రాన్ని జూలై 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణ దాస్ నారంగ్ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేశ్ ‘నారప్ప’ఓటీటీలో రాబోతుందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు. జూలై 30వ తేదీన సినిమాను పక్కాగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.