నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిసున్న చిత్రం ‘లవ్స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తూ వచ్చాం. ఇన్ని రోజులు సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ శుభతరుణం రానే వచ్చింది. థియేటర్లలో సినిమాను అందరూ ఆస్వాదించండి’ అన్నారు. ‘సినిమాలోని ‘సారంగదరియా…’ గీతం ఆల్టైమ్ రికార్డులు సృష్టించింది. పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. సున్నితమైన భావోద్వేగాలతో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది’ అని చిత్రబృందం తెలిపింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి కుమార్, సంగీతం: పవన్ సి.హెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐర్ల నాగేశ్వరరావు, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.