Asaduddin Owaisi | హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘ధురంధర్ 2’ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, ఒవైసీ మాత్రం దీనిని ఒక చెత్త సినిమాగా అభివర్ణించారు.
ఒక మీడియా సదస్సులో ఒవైసీ మాట్లాడుతూ.. ‘ధురంధర్ 2’ వంటి మూడు గంటల పనికిరాని సినిమాలను చూసే సమయం తనకు లేదని అన్నారు. ఈ చిత్రం పూర్తిగా హింసను ప్రేరేపించేలా ఉందంటూ ఆయన మండిపడ్డారు. “అసలు అది ఒక సినిమానా? అందులో మూడు గంటల పాటు కేవలం బూతులు, హింస తప్ప మరేమీ లేదు” అని ఆయన కొట్టిపారేశారు. ఈ సినిమాలో ముస్లింలను చిత్రీకరించిన విధానంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేయగా.. ఆయన తనదైన శైలిలో హైదరాబాదీ యాసలో స్పందిస్తూ, ఇలాంటి విషయాలను తాను పట్టించుకోనని (ఐసే చీజాం కు హమ్ లైట్ లేతే) తేల్చి చెప్పారు.