దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల నిరీక్షణకు తెరదించుతూ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ ట్రైలర్ గురువారం హైదరాబాద్లో అభిమానుల కోలాహలం నడుమ అట్టహాసంగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సుదర్శన్ థియేటర్ వేదికైంది. తెలుగు ట్రైలర్ను అగ్ర హీరోలు చిరంజీవి, ప్రభాస్ విడుదల చేశారు. మలయాళ, హిందీ ట్రైలర్స్ను దుల్కర్ సల్మాన్, రణ్వీర్సింగ్ రిలీజ్ చేశారు.
‘ఒక లయన్కి, టైగర్కి పుట్టిండాడు..క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ’ అంటూ రమ్యకృష్ణ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం రోమాంచితంగా సాగింది. ఓ సాధారణ యువకుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాక్సింగ్ టైటిల్ను గెలుచుకోవడానికి చేసిన ప్రయాణాన్ని ఉద్వేగభరితంగా చూపించారు. పోరాటఘట్టాలు హాలీవుడ్స్థాయిలో కనిపించాయి. లైగర్ లవ్లైఫ్ను కూడా ట్రైలర్లో ఆవిష్కరించారు. చివరగా ‘ఐయామ్ ఏ ఫైటర్’ అని విజయ్ దేవరకొండ అంటే..దానికి ప్రతిగా ‘నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి?’ అంటూ మైక్ టైసన్ ప్రశ్నించడం ఆసక్తినిరేకెత్తించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘అభిమానుల రచ్చ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. ఈ సినిమాను అభిమానులకు అంకితమిస్తున్నా. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని ఈ సినిమాలో ఫైట్స్తో పాటు డ్యాన్స్లు కూడా చేశా. ఆగస్ట్ 25న ప్రతి థియేటర్లో పండగ జరగాలి. మీ అందరికి ప్రామిస్ చేస్తున్నా. ఆ రోజు ఇండియా షేక్ అయితది. ఆగ్ లగా దేంగే’ అని అన్నారు. “లైగర్’ ఇండియన్ సినిమాలోనే బిగ్ మూవీ కాబోతుంది. రాసిపెట్టుకోండి. ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చూపించడానికే కరణ్జోహార్ను ఇక్కడకు పిలిచా’ అని పూరి జగన్నాథ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు కరణ్జోహార్, అపూర్వ మెహతా, చిత్ర కథానాయిక అనన్యపాండే, అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.