Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ఇటీవల ఆనంద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్యగా మారారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది లింగ వివక్ష ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. ఈ విమర్శలపై మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు.గతంలో ఒక కార్యక్రమంలో చిరంజీవి తన కుటుంబంలో ఎక్కువగా మనవరాళ్లు ఉన్నారని, ఒక మనవడు కూడా ఉంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.
దీనిపై ఓ జర్నలిస్ట్ వ్యంగ్యంగా ట్వీట్ చేయడంతో విషయం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిరంజీవికి మద్దతుగా నిలిచారు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను. కానీ మీ నుంచి ఇది ఊహించలేదు. ఒక సంతోషకరమైన సందర్భాన్ని చెడగొట్టారు. ఆయన తన కుటుంబంలోని మహిళలను ఎంత గౌరవంగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే పనిలో 1 శాతం చేసే మగవాళ్లు కూడా చాలా తక్కువ. నిజంగా తెలియని వారి గురించి కామెంట్ చేయకపోవడం మంచిది అంటూ లావణ్య చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆమె వ్యాఖ్యలకు మెగా అభిమానుల నుంచి భారీ మద్దతు లభించగా, కొందరు ఆమె ఉపయోగించిన భాషపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఆ జర్నలిస్ట్ తన ట్వీట్ను తొలగించడం గమనార్హం. అయితే ఈ ఘటనతో సోషల్ మీడియాలో చర్చలు మరింత పెరిగాయి. “కుటుంబ సభ్యులను ప్రశంసించడానికి ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం లేదు అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మాత్రం లావణ్య తన మామయ్యకు అండగా నిలవడం అభినందనీయం అంటున్నారు. చిరంజీవి కుటుంబ వివరాలు కూడా ఈ సందర్భంలో చర్చకు వచ్చాయి. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ముందుగా క్లీంకార అనే కుమార్తె జన్మించగా, ఇప్పుడు కవల పిల్లలు పుట్టారు. చిరంజీవి కుమార్తెలైన సుష్మిత కొణిదెలకు సమర, శ్రీజ కొణిదెలకు నివ్రతి, నవిష్క అనే కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో ఎక్కువగా అమ్మాయిలే ఉండటాన్ని సరదాగా ప్రస్తావించిన చిరంజీవి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీయగా, లావణ్య త్రిపాఠి స్పందనతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.