విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ను పూర్తి చేశారు. ఈ నెల 9న ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోషల్మీడియాలో వ్యూస్పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ట్రైలర్ కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. హృద్యమైన ప్రేమకథా చిత్రంగా అందరిని ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. జయరాం, సచిన్ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ.