సినీరంగాన్ని కెరీర్గా ఎంచుకుంటున్నానని చెప్పినప్పుడు తొలుత తన తల్లిదండ్రులు ఎంతగానో భయపడ్డారని, మధ్యతరగతి మహిళలకు సరైన వేదిక కాదని వారించారని చెప్పింది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. తన లక్ష్యాలేమిటో స్పష్టంగా వివరించడంతో చివరకు వారు అంగీకరించారని, అయితే చదువు పూర్తి చేసుకున్నాకే వెళ్లాలని షరతు విధించారని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మాది పూర్తి మధ్యతరగతి కుటుంబం. సినీరంగమంటే మా పేరెంట్స్కు తెలియని భయాలుండేవి. అందుకే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నాకే సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఒకవేళ అక్కడ విఫలమైనా ఇంజినీరింగ్ పట్టా చేతులో ఉంటే జీవితానికి ఢోకా ఉండదని సూచించారు. వారిచ్చిన ప్రోత్సాహంతో పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అయ్యాను. ఈ ప్రయాణంలో ఎప్పుడూ అధైర్యపడలేదు. మంచి మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండటం వల్ల ఇండస్ట్రీలో విఫలమైనా జీవితానికి ఇబ్బంది ఏమిరాదనే భరోసా ఉండేది. చదువు ఉందనే ధైర్యం ఉంటే ఎక్కడైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయొచ్చు. కొత్తవారెవరైనా తమ ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని పరిశ్రమలో అడుగుపెడితే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు’ అని కృతిసనన్ చెప్పుకొచ్చింది. ‘మిమి’ చిత్రంలోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె బచ్చన్ పాండే, బేడియా, గణపతి, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నది.