హైదరాబాద్: ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని నివాసంలో ఉన్న ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు కడసారి నివాళులర్పిస్తున్నారు. సీనియర్ నటులు కోటా శ్రీనివాస రావు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, ప్రకాశ్ రాజ్, సునీల్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా, మరికొద్దిసేపట్లో కృష్ణంరాజు భౌతికకాయాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంత సమయం ఉంచనున్నారు. అనంతరం అక్కడినుంచి రెబల్స్టార్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.