Srimanthudu | హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలు కాపీరైట్స్ తంటాలు ఎదుర్కోవడం కొత్త కాదు. తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలా వివాదాలు బోలెడున్నాయి. సినిమా హిట్ అయ్యిందన్న ఆనందంతో ఉండే చిత్రబృందానికి ఇలాంటి వివాదాలు తలనొప్పి వ్యవహారమే. గతంలో ‘భజరంగీ భాయ్ జాన్’ కథ తనదేనంటూ ఒకరు వివాదానికి కాలు దువ్వగా, 2015లో మహేశ్బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీమంతుడు’ కూడా వివాదాల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్నది.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఆ ఏడాది సూపర్ డూపర్గా నిలిచిన సినిమాల్లో ‘శ్రీమంతుడు’ రెండోస్థానాన్ని పదిలపర్చుకుంది. ఈ చిత్ర కథ విషయంలో దర్శకుడు వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టులోనూ కొరటాల శివకు చుక్కెదురైంది. ఎనిమిదిన్నరేండ్లుగా ఈ కేసును ఎదుర్కొంటూ వస్తున్న ఆయనకు దేశ సర్వోన్నత న్యాయస్థానమూ మొట్టి కాయలేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం స్పష్టం చేసింది.
కేసు అసలు ‘కథ’ ఎంటంటే..?
శరత్ చంద్ర అనే రచయిత ‘చచ్చేంత ప్రేమ’ పేరుతో సినిమా తీసేందుకు జయలక్ష్మి ఫిలిమ్స్ వారికి హక్కులు ఇచ్చారు. నారా రోహిత్ కథానాయకుడిగా సముద్ర దర్శకత్వంలో ఆ సినిమా తీయాలనుకున్నారు. అందుకు సంబంధించి సన్నాహాల్లో ఉండగా ‘శ్రీమంతుడు’ 2015 ఆగస్టు 7న విడుదలైంది. స్వాతి వారపత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ‘శ్రీమంతుడు’ సినిమాగా మలిచారంటూ రచయిత శరత్చంద్ర వివాదం లేవనెత్తారు.
సినిమా విడుదల సమయంలో కేరళలో ఉన్న ఆయన మిత్రుడు చెప్పిన ‘శ్రీమంతుడు’ స్టోరీ తన కథలాగే ఉందని గ్రహించి సినిమా చూశారు. వెంటనే సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు. కొంత మంది పరిశ్రమ పెద్దల దృష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తనకు న్యాయం జరిగేలా లేదని భావించి మీడియా ముందుకొచ్చి గోడు వెల్లబోసుకున్నారు. నాంపల్లి కోర్టులో కేసు వేశారు. రచయిత పిటిషన్పై విచారణ జరిపి సదరు దర్శకుడిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై దర్శకుడు కొరటాల శివ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో తన కథను కాపీ కొట్టారన్న తన వాదనకు తగ్గ ఆధారాలను శరత్చంద్ర హైకోర్టుకు సమర్పించారు. శరత్చంద్ర సమర్పించిన ఆధారాలను నిర్ధారిస్తూ రచయితల సంఘం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ఇందుకు బలం చేకూర్చింది. రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్ధించింది. దీంతో చేసేది లేక దర్శకుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
తాజాగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత శరత్చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదంటూ సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిరంజన్రెడ్డి దర్శకుడు కొరటాల శివ తరఫున వాదనలు వినిపించారు.
అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగానే హైకోర్టు నిర్ణయం తీసుకున్నదని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని ధర్మాసనం పేర్కొన్నది. కొరటాల శివ పిటిషన్ను పరిగణనలోకి తీసుకొని తదుపరి విచారణ జరిపేందుకు ఏమీ లేదని కూడా స్పష్టం చేసింది. పిటిషన్ను మీరు వెనక్కి తీసుకుంటారా?.. లేక మమ్మల్నే డిస్మిస్ చేయమంటారా?.. అని ధర్మాసనం నిరంజన్రెడ్డిని ప్రశ్నించింది. తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం అందుకు అనుమతించింది. చివరికి ఇలా ‘కథ’ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.