ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ జీవితాలకు ఫిక్షనల్ అంశాలను జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 7న విడుదలకానుంది. ఎన్టీఆర్ పాత్ర నేపథ్యంలో వచ్చే ‘కొమురం భీముడో..కొమురం భీముడో’ అనే వీడియో గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. ‘భీమా..నిన్ను గన్న నేల తల్లి. ఊపిరి బోసిన చెట్టుచేమ..పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుండ్రు. వినబడుతుందా’ అంటూ ప్రారంభమైన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటున్నది. కొమురం భీమ్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ సాగే ఈ పాటకు సుద్దాల అశోక్తేజ సాహిత్యాన్నందించారు. కాలభైరవ ఆలపించారు. కీరవాణి స్వరకర్త. కథాగమనంలో కీలక సందర్భంలో వచ్చే గీతమిదని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.