పుడమికి పచ్చలహారం అలంకరించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అపూర్వ కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీతారలు పాల్గొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ‘సమ్మతమే’ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందినీ, నిర్మాత ప్రవీణ పాల్గొన్నారు. శనివారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ…‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. పచ్చటి ప్రకృతి కోసం మొక్కలు నాటడం మనమంతా బాధ్యతగా స్వీకరించాలి’ అన్నారు. ‘సమ్మతమే’ చిత్రబృందానికి ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.