Krishnam Raju | ప్రముఖ నటుడు కృష్ణంరాజుది రాజుల కుటుంబమే. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో క్షత్రియ రాజవంశంలో జన్మించారు. ఆయన విజయనగర సామ్రాజ్య క్షత్రియ రాజవంశానికి చెందిన వారు. ఆయన తన చిన్ననాట పాఠశాలకు గుర్రపు బండిలో రాజులా వెళ్లేవారు. అయితే, ఆయనకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండకపోవడంతో.. సినిమాలు, మిత్రులతో కలిసి షికార్ల కోసమే అధిక సమయం వెచ్చించేవారు. ఆ రోజుల్లో ప్రధాన వినోదం కావడంతో.. సినిమాలను ఎక్కువగా చూసేవారు. అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి జంటగా నటించిన సువర్ణ సుందరి చిత్రాన్ని ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా 30 సార్లు చూశారు.
అలాగే మూగ మనసులు చిత్రాన్ని 25సార్లు చూశారంటే.. సినిమాలంటే ఎంత మక్కువో తెలుస్తుంది. ఆ మక్కువతోనే సినీరంగ ప్రవేశం చేశారు. బీకాం చదువుతున్న సమయంలో ఆంధ్రరత్న పత్రికలో విలేకరిగా పని చేశారు. ఆ తర్వాత చదువును మధ్యలోనే మానేసి హైదరాబాద్ నగరంలోని అడిడ్స్లో రాయల్ ఫొటో స్టూడియోను నెలకొల్పారు. ఈ క్రమంలో అబిడ్స్లో ఓ రోజు కాఫీ తాగుతూ అక్కాచెల్లెళ్లు మూవీ దర్శకుడు పద్మనాభ రావు కంట్లో పడ్డారు కృష్ణం రాజు. హీరో మారిదిగా ఉండడంతో కృష్ణంరాజు వద్దకు వచ్చి సినిమాల్లో నటిస్తావా? అని అడిగారు. దీంతో కృష్ణం రాజు ఎవరికీ చెప్పకుండా మద్రాస్కు వెళ్లిపోయారు. 1966లో చిలుకా గోరింక చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. కృష్ణంరాజు హీరోగానే సినీజీవితాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత విలన్ పాత్రలే ఎక్కువ చేశారు.
తొలి చిత్రం ‘చిలకా గోరింకా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల కొంత నిరాశకులోనైన ఆయన.. కథానాయకుడిగా కాకుండా నటుడిగా నిరూపించుకోవాలని నిర్ణయించుకొని.. శిక్షణ తీసుకొని.. తనను తాను మలచుకున్నారు. ఆ తర్వాత విలన్గా తొలిసారి ‘అవే కళ్లు’ చిత్రంలో నటించిన ఆయన దాదాపు 30 చిత్రాల వరకు విలన్ పాత్రల్లోనే తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. విలనిజంలోనూ ప్రత్యేకతను చాటిన కృష్ణంరాజు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు హీరోలుగా చేసిన చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత సపోర్టింగ్ హీరో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కృష్ణంరాజు మళ్లీ హీరోగా మారి వరుసగా చిత్రాలతో రెబల్ స్టార్గా ఎదిగారు. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్ ఏలిన రెబల్ స్టార్ 183కుపైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్లో పలు చిత్రాలు రూపొందించారు. తమ్ముడి కొడుకు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాలో వెండితెరపై కృష్ణంరాజు చివరిసారిగా కనిపించారు.