తిరువనంతపురం: ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) ఇక లేరు. గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కేరళ రాష్ట్రంలోని కక్కనాడ్లోగల ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. 1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా జార్జ్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
కేజీ జార్జ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘స్వప్నదానం’ ఆయనకు జాతీయ చలనచిత్ర అవార్డును సాధించిపెట్టింది. మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం 2015లో జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. అంతేగాక కేజీ జార్జ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ పాఠశాలను స్థాపించారు. మలయాళ సింగర్ సెల్మా జార్జ్ని 1977లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం.