The Kerala Story 2 : త్వరలో విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ చిత్రాన్ని వివాదాలు వీడటం లేదు. ఈ చిత్ర విడుదలను ఆపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం చిత్ర నిర్మాతలు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతోపాటు, కేంద్ర సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ చిత్రం ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది.
అయితే, ఈ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలంటూ కేరళకు చెందిన బయాలజిస్ట్ శ్రీదేవ్ నంబూత్రి హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్ర టీజర్ తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ చిత్ర టీజర్ ప్రకారం కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్కు చెందిన ముగ్గురు పెళ్లి కాని యువతులు టెర్రరిస్టుల ట్రాప్లో పడతారని, ఇందుకోసం ప్రేమను ఆయుధంగా వాడి జనాభాలో మార్పుల్ని తీసుకొస్తున్నట్లుగా చూపించారని పిటిషనర్ శ్రీదేవ్ పేర్కొన్నారు. అలాగే ఇందులో నటీనటులు పలికిన మాటలు శాంతి భద్రతల్ని దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషనర్ వాదించారు. ఈ తరహా చిత్రీకరణ ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతుందని, మత ఘర్షణలకు దారి తీస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరారు.
ఈ చిత్రంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. దీన్ని విద్వేష, దురుద్దేశ పూర్వక సినిమాగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ దర్శకత్వం వహించారు. సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు.