Keerthy Suresh | మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు నటి కీర్తి సురేశ్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో హిట్ కొట్టిన కీర్తి.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలోని ఓ పాటకు ఊర మాస్ స్టెప్పులేసి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
‘దసరా’ చిత్రంలోని రగ్గుడ్ అవతార్లో ఇప్పటికే నాని ఆకట్టుకోగా.. తాజాగా కీర్తి సురేశ్ ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటకు తన స్నేహితురాలు అక్షితతో కలిసి ఊరమాస్ స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంటోంది. వదులు చొక్కా.. లుంగీ ధరించి, బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని మాస్ స్టెప్పులతో నెట్టింట రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహానటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఊర మాస్ లుక్లో కీర్తి సురేశ్ను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘నేను లోకల్’ తర్వాత నాని – కీర్తి సురేశ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘దసరా’. ఈ చిత్రానికి ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ బాణీలు సమకూరుస్తున్నారు. 2023 మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.