నాయిక ప్రధాన చిత్రాల్లో మెప్పించడం అందరి నాయికలకూ సాధ్యం కాదు. అందుకు ఒక స్టార్ హీరోకున్న ఇమేజ్ కావాలి. ‘మహానటి’ సినిమాతో దక్షిణాది అంతటా ఘన విజయాన్ని సాధించి, అలాంటి ప్రతిభ తనకుందని నిరూపించింది కీర్తి సురేష్. ఆ తర్వాత ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’, ‘పెంగ్విన్’ వంటి చిత్రాలతో ఈ ట్రెండ్ను కొనసాగించింది. కీర్తి సురేష్ తాజాగా మరో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారట.
నటుడు సుహాస్ ఓ కీలక పాత్రను పోషించనున్నారని తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ సినిమా సరికొత్త కథ, కథనాలతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. నాయికా ప్రధాన చిత్రాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా కీర్తి సురేష్కున్న క్రేజ్తో ఈ తరహా చిత్రాలు నిర్మించేందుకు మేకర్స్ ముందుకొస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సోదరిగా ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్న కీర్తి….కోలీవుడ్లో ‘సిరెన్’, ‘రఘుథాత’, ‘రివాల్వర్ రీటా’ చిత్రాల్లో నటిస్తున్నది.