కెరీర్ ఆరంభంలో చాలామంది నటీనటులు కష్టాలు పడ్డవారే. కానీ తమ సత్తా నిరూపించుకొని, స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత అలాంటి పరిస్థితి దాదాపు ఎవరికీ రాదు. కానీ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్కు ఇలాంటి కష్టాలే వచ్చాయి. ఈ విషయాన్ని బిగ్బీనే స్వయంగా చెప్పాడు.
ఆయన హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ) కార్యక్రమం వెయ్యో ఎపిసోడ్లో ఈ విషయాలను ఆయన గుర్తుచేసుకున్నాడు. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్, మనుమరాలు నవ్యనవేలీ నంద ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్తె అడిగిన ప్రశ్నకు అమితాబ్ బదులిస్తూ.. షో ప్రారంభమైనప్పటి తన అనుభవాలను పంచుకున్నారు.
21 సంవత్సరాల క్రితం సినిమాల్లో తనకు అవకాశాలు దొరకలేదని, ఆ సమయంలోనే కేబీసీ కార్యక్రమం ఒప్పుకున్నానని చెప్పాడు. ఇలాంటివి చేస్తే కెరీర్ పోతుందంటూ చాలా మంది హెచ్చరించారని, కానీ తొలి షో ప్రీమియర్ తర్వాత వచ్చిన స్పందన చూసిన తర్వాత తనకు నమ్మకం కలిగిందన్నాడు.
‘వెండితెర మీద నుంచి బుల్లితెర మీదకు వెళ్తున్నారు. మీ ఇమేజ్ చాలా దెబ్బతింటుంది’ అంటూ హెచ్చరికలు చేశారు. ‘కానీ అప్పుడు నా పరిస్థితులు వేరు. సినిమాల్లో పని దొరకడం లేదు. ఆ తర్వాత తొలి షో బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత స్పందన చూస్తే.. నా ప్రపంచం మారిపోయిందనిపించింది’ అని చెప్పాడు.
అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ జర్నీకి సంబంధించిన విజువల్స్ చూపించారు. అవి చూసిన అమితాబ్ కన్నీరు పెట్టుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ అమితాబ్ను చీర్ చేశారు. 2000 సంవత్సరంలో కేబీసీ తొలి సీజన్ ప్రారంభమైంది. ఈ షోతోనే తొలిసారి అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై కనిపించారు.
ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి బిగ్బీనే హోస్ట్ చేస్తూ వచ్చారు. కేవలం మూడో సీజన్లో మాత్రమే షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశాడు.