బాలీవుడ్ ప్రేమజంట విక్కీకౌశల్, కత్రినాకైఫ్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మూడేళ్ల ప్రేమాయణాన్ని పెళ్లిపీటలవరకు తీసుకొచ్చిన ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్థాన్లోని భర్వార్ కోటలో ఒక్కటయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుక తాలూకు జ్ఞాపకాల్ని ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు కొత్త జంట. సోమవారంనాటి హల్దీ వేడుక ఫొటోలను తమ సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్చేశారు. ఇందులో విక్కీ కౌశల్ చెంపలపై పసుపురాస్తూ కత్రినా కనిపించింది. భర్తను చూస్తూ చిరునవ్వులను చిందిస్తున్నది. పెళ్లి తర్వాత జరిగిన వరమాల వేడుకలో కత్రినా పట్ల తనకున్న ప్రేమను గురించి విక్కీకౌశల్ వెల్లడించినట్లు తెలిసింది. కత్రినాకైఫ్ పరిచయమైన తర్వాతే తన జీవితం మొత్తం మారిపోయిందని, అసలైన ప్రేమేమిటో తెలుసుకున్నానని విక్కీకౌశల్ పేర్కొన్నారు. భర్త మాటలతో భావోద్వేగానికి గురైన కత్రినాకైఫ్ ఆనందభాష్పాలతో ప్రేమను వ్యక్తం చేసిందట.