బాలీవుడ్ ప్రేమజంట విక్కీకౌశల్, కత్రినాకైఫ్ పెళ్లిపీటలెక్కెందుకు సిద్ధమవుతున్నారు. వీరి వివాహానికి ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్ సవాయ్ మాదోపూర్లోని సిక్స్సెన్సెస్ రిసార్ట్లో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా పెళ్లి వేడుకను నిర్వహించబోతున్నారు. కేవల రెండువందల మంది అతిథులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తున్నారని తెలిసింది. మెహందీ పంక్షన్ను సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. మీడియా కవరేజీకి దూరంగా వివాహ వేడుకను జరపడానికి నిశ్చయించారని, అతిథులు కూడా తమ మొబైల్ ఫోన్లను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అప్పగించి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. కత్రినాకైఫ్ సీనియర్ కథానాయికగా బాలీవుడ్లో పేరు తెచ్చుకోగా..విక్కీకౌశల్ అనతికాలంలోనే హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్ధమ్’ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది.