ముంబై: కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసలపై తీసిన చిత్రం కశ్మీర్ ఫైల్స్. ఆ ఫిల్మ్ ఇప్పుడు ఇండియన్ మూవీ మార్కెట్లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల రిలీజైన ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. 1990లో కశ్మీర్లో జరిగిన ఊచకోత ఆధారంగా సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా నేటితో వంద కోట్ల ఆదాయాన్ని దాటేసింది. అయితే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వివేక్ అగ్నిహోత్రికి ‘వై’ క్యాటగిరీ భద్రతను కల్పించారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ద్వారా తెలిసింది.
కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించారు. బీహార్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్చి 25వ తేదీన ఈ సినిమాను ఉచితంగా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ సినిమాను వీలైనంత మంది చూడాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ తెలిపారు. సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషిలు నటించారు.