Karuppu Team | ప్రముఖ సంగీత దర్శకుడు, ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాకు సూర్య ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్ర బృందం బహిరంగ క్షమాపణలు చెప్పింది. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాలో వచ్చే ఒక సీన్లో బ్యాక్గ్రౌండ్లో విజయ్కాంత్ సినిమా పాట వినిపిస్తున్న సమయంలో, పాటల ‘కాపీరైట్’ వివాదాలపై వచ్చే కొన్ని సంభాషణలు పరోక్షంగా ఇళయరాజాను కించపరిచేలా మరియు వ్యంగ్యంగా ఉన్నాయంటూ ఆయన అభిమానులు, సినీ విశ్లేషకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో తన అనుమతి లేకుండా పాటలు వాడుకుంటే ఇళయరాజా లీగల్ నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో, సినిమాలో పెట్టిన ఈ సెటైర్లు ఆయన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
ఈ వివాదం ముదరడంతో తక్షణమే స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సోషల్ మీడియా ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఇళయరాజా గారిపై తమకు ఎంతో గౌరవం ఉందని, భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఆయన్ను అగౌరవపరచడం లేదా కించపరచడం తమ ఉద్దేశం కాదని, కేవలం ఒక సాధారణ హాస్య సందర్భంలో భాగంగా మాత్రమే ఆ డైలాగ్స్ వచ్చాయని, అవి ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆయనపై ఉన్న గౌరవంతో ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇళయరాజా గారిని ఉద్దేశిస్తూ ఉన్న ఆ సంభాషణలను, వివాదాస్పద సీన్ను సినిమా తదుపరి ప్రదర్శనల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.