Salaar | నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అంటూ సామెత ఉంటుంది కదా.. ఇప్పుడు ఓ కన్నడ హీరోను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో విషయంలో కామెంట్స్ చేయడం.. చివాట్లు తినడం అనేది ఆయనకు అలవాటుగా మారిపోయింది. గతంలోనూ చనిపోయిన పునీత్ రాజ్కుమార్పై కూడా ఇలాగే మాట్లాడి అందరి దృష్టిలో విలన్ అయ్యాడు ఆ హీరో. ఇప్పుడు సలార్ సినిమాపై నోరు పారేసుకున్నాడు. ఆయనెవరో కాదు దర్శన్. తెలుగులో పెద్దగా ఈయనకు గుర్తింపు లేదు. కన్నడ హీరోలకు ఈ మధ్య తెలుగు మార్కెట్ బాగానే వస్తున్నా కూడా దర్శన్ మాత్రం మన వాళ్లకు అస్సలు పరిచయం లేదు. ఆయన ఫోటోను చూపించినా కూడా ఎవరబ్బా ఈయన అని అడిగే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ కర్ణాటకలో మాత్రం ఈయన తోపు హీరో. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలాగో.. కన్నడిగులకు దర్శన్ కూడా అలాగే.
ది బాస్ అంటూ ఆయన్ని గొప్పగా పిలుచుకుంటారు వాళ్లు. వాళ్ల హీరో.. వాళ్ల ఇష్టం.. పిలవకపోతే నెత్తిన పెట్టుకొమ్మను మనకెందుకు కానీ మన సినిమాల గురించి, హీరోల గురించి మాట్లాడేటప్పుడు కాస్తైనా జ్ఞానంతో ఉండాలి కదా అనేది ఈయనపై వస్తున్న విమర్శలు ఇప్పుడు. అసలు విషయం ఏంటంటే.. దర్శన్ నటిస్తున్న కాటేరా సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. అక్కడ ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా బడ్జెట్ కూడా చాలా భారీగా పెట్టారు. ఎలాగూ కేజీఎఫ్ పుణ్యమా అని కన్నడ మార్కెట్ పెరిగిపోయింది. అందుకే కాటేరా రేంజ్ కూడా బాగానే పెరిగింది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్లోనే సలార్ సినిమాపై నోరు జారాడు దర్శన్. మీ సినిమా కంటే వారం ముందే సలార్, డంకీలు వస్తున్నాయి కదా.. థియేటర్ల సమస్య ఉండొచ్చా అని మీడియా అడిగితే దర్శన్ చెప్పిన సమాధానమే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరో వస్తే నేనేందుకు భయపడాలి.. పక్క ఇండస్ట్రీ నుంచి వస్తున్న వాళ్లు కదా మనల్ని చూసి భయపడాలి.. అయినా కాటేరా మనోళ్ల కోసం ఇక్కడి థియేటర్ల కోసం తీసిన సినిమా అంటూ రెచ్చిపోయాడు.
మీ సినిమానే.. ఎవరు కాదన్నారు కానీ చెప్పే పద్దతి అయితే కచ్చితంగా ఇది కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే పాన్ ఇండియన్ సినిమాలు వచ్చిన తర్వాత రీజినల్ ఫీలింగ్ లేకుండా పోయింది. ఇలాంటి టైమ్లో దర్శన్ వచ్చి.. ఇది కన్నడ సినిమా.. మన వాళ్ల కోసమే తీసిన సినిమా అంటూ చెప్పడం వివాదాస్పదం అవుతుంది. గతంలో ఇలాంటి ప్రశ్నే ఘోస్ట్ సమయంలో శివ రాజ్కుమార్ను అడిగితే ఆయన చాలా సౌమ్యంగా సమాధానమిచ్చారు. అన్ని సినిమాలు ఒక్కటే అని.. అందరికీ థియేటర్స్ దొరుకుతాయంటూ సముచితంగా మాట్లాడాడు. ఘోస్ట్ వచ్చినపుడు టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, లియో కూడా విడుదలయ్యాయి. అప్పుడే శివన్న ఇలా చెప్పాడు. కానీ ఇప్పుడు దర్శన్ మాత్రం నేనే తోపు.. నా సినిమానే కత్తి అన్నట్లు కటింగ్ ఇస్తున్నాడంటూ ఆయనపై మండి పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చూడాలిక.. ఈయనంతగా నమ్ముతున్న కాటేరాకు కన్నడిగులు ఓటేస్తారో లేదంటే సలార్కు సై అంటారో..?