అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే జాతీయ తారగా ఎదిగింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. అనతికాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిన ఈ భామను ‘నేషనల్ క్రష్’ అంటూ అభివర్ణించారు. ఇక ‘పుష్ప’ చిత్రంలో పోషించిన శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. తెలుగులో ‘పుష్ప-2’తో పాటు ‘సీతారామం’ చిత్రంలో నటిస్తున్నది. బాలీవుడ్లో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న చెప్పిన సంగతులు..
సినీరంగంలోకి అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే పాన్ ఇండియా తారగా పేరు తెచ్చుకోవడం దేవుడి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. చిన్నతనం నుంచి ఆరాధించే గొప్ప నటులతో కలిసి తెరను పంచుకోవడం గొప్ప అనుభూతినిస్తున్నది. భారీ చిత్రాల్లో అవకాశాలు లభిస్తున్నాయన్న సంతృప్తితో పాటు వినూత్న కథాంశాల్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. కెరీర్పరంగా పూర్తి సంతృప్తితో ఉన్నా. కేవలం ఐదేళ్ల ప్రయాణంలో ఈ స్థాయి పాపులారిటీ దక్కించుకోవడం అదృష్టమే అనుకుంటున్నా. ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా నిర్వచించుకుంటున్నా. నటనలో మరింత పరిణితి కనిపిస్తున్నది.
స్కూల్ రోజుల నుంచే దళపతి విజయ్ నా అభిమాన హీరో. ఆయనతో సినిమా ఛాన్స్ అనగానే నా ఆనందందానికి అవధులు లేకుండా పోయాయి. తొలిరోజు షూటింగ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూశా. క్లాప్ కొట్టిన తర్వాత విజయ్కు దిష్టి తీసి ఆయన పట్ల నాకున్న ఆరాధన చాటుకున్నా. దిష్టి తీయగానే విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సెట్లో వున్న వారంతా సరదాగా నవ్వులు చిందించారు. అంతటి స్టార్డమ్ ఉన్నప్పటికి విజయ్ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనలోని సింప్లిసిటీ నన్ను బాగా ఆకట్టుకుంది.
భాషాపరంగా నేను ఎలాంటి హద్దుల్ని విధించుకోలేదు. ప్రతి భాషలో సినిమాలు చేయాలి..అక్కడి ప్రేక్షకుల ప్రేమను పొందాలన్నదే నా అభిమతం. భాషాంతరాల్ని చెరిపివేసినప్పుడే జాతీయ తారగా రాణించగలం అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నేటి ట్రెండ్లో సినిమా బాగుంటే అది ఏ భాషా చిత్రమనే విషయం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అభినయంతో మెప్పిస్తే చాలు ఏ నటుడికైనా బ్రహ్మరథం పడుతున్నారు. భారతీయ సినీరంగం నూతనత్వాన్ని సంతరించుకుంటున్న ఈ తరుణంలో నేను కథానాయికగా చలామణి కావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం భారతీయ సినిమా సృజనాత్మకంగా గొప్ప మార్పు దిశగా పయనిస్తున్నది.
ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్ని హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘పుష్ప’ ‘ఆర్ఆర్ఆర్’ ‘కేజీఎఫ్-2’ సినిమాలు సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. అయితే దక్షిణాది చిత్రాల పట్ల హిందీ వారు ఒక్కసారిగా క్రేజ్ పెంచుకోలేదు. ఉత్తరాది పల్లెల్లో షూటింగ్ సందర్భంగా చాలా మంది ప్రజలు తాము ఎప్పటి నుంచో సౌత్ సినిమాలను టెలివిజన్లో చూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు బిగ్స్క్రీన్లో చూడటం కొత్తగా ఉందని అన్నారు. దక్షిణాది వారు తమ సంస్కృతి, ఆచార వ్యవహారాల్ని బాగా ప్రేమిస్తారని ఉత్తరాది వారు భావిస్తారు. మన సినిమాలు అక్కడ రికార్డులు సృష్టించడానికి అదో కారణంగా చెప్పొచ్చు.
‘గుడ్బై’ చిత్రానికి లెజెండ్ అమితాబ్బచ్చన్గారితో పనిచేయడం ఓ జీవితకాలపు అనుభవం. షూటింగ్ గ్యాప్లో ఆయన ఎన్నో గొప్ప విషయాల్ని చెప్పేవారు. కెరీర్లో ఎదగాలంటే మనకు ఏం అవసరమో ఆయన మాటల ద్వారా తెలుసుకున్నా. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. కొందరు అగ్ర హీరోలతో ఇంకా సినిమాలు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నా సినీ ప్రయాణం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. సానుకూల దృక్పథంతో భవిష్యత్తులోకి అడుగులు వేస్తున్నా.