శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన తన చెల్లెలు రంగోలి యోగా ద్వారా సాధారణ స్థితికి చేరుకుందని చెప్పింది బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కంగనారనౌత్ చేసిన ఓ పోస్ట్ హృదయాన్ని కదిలించేలా ఉంది. ‘చెల్లెలు 21ఏళ్లున్నప్పుడు యాసిడ్ దాడికి గురైంది. ముఖం కాలిపోవడంతో పాటు చూపును కోల్పోయింది. శరీరంలోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ఆ ఘటనతో చెల్లి జీవితం తలక్రిందులైంది. అంతకుముందే రంగోలికి ఎంగేజ్మెంట్ జరిగింది. యాసిడ్ దాడి తర్వాత చెల్లి ముఖం చూసిన ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు.
ఈ క్రమంలో ఆమెకు యాభైకిపైగా సర్జరీలు జరిగాయి. తన దురదృష్టానికి చెల్లెలు మౌనంగా రోదించేది. ఎవరితో మాట్లాడకుండా గదిలో ఒంటరిగా కూర్చునేది. ఎంతోమంది మానసిక నిపుణుల్ని కలిసినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. ఆ తర్వాత నాతో పాటు యోగా క్లాసులకు హాజరుకావడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి చెల్లెలు జీవితంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కంటి చూపు మెరుగైంది. తిరిగి తను సోషల్లైఫ్లోకి రావడానికి యోగా ఎంతగానో ఉపకరించింది’ అని కంగనారనౌత్ చెప్పింది.