Kangana Ranaut | ‘దేశప్రధాని కావాలనే కోరిక మీకెప్పుడైనా కలిగిందా?’.. ఈ ప్రశ్న ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కంగనాకు ఎదురైంది. ఇటీవల జరిగిన ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ అనే తెలుగు సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే కంగనాపై ఓ విలేకరి ఈ ప్రశ్నను సంధించారు. దానికి ఆమె మాట్లాడుతూ- ‘నేను ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేశాను. ఆ సినిమా చూసిన ఏ ప్రేక్షకుడూ నేను ప్రధాని కావాలని కోరుకోడు’ అని సూటిగా సమాధానమిచ్చింది. గత ఏడాది ప్రారంభంలో కూడా రాజకీయాలపై తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది కంగనా.
‘నేను సున్నితమైన వ్యక్తిని. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తిని కాదు. రాజకీయాల్లోకి రావాలని నన్ను చాలామంది అడిగారు. అయినా నేను అటువైపు వెళ్లలేదు’ అని కంగనా తెలిపింది. కంగనా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. దివంగత భారతప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించిన విషయం తెలిసిందే. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు.