బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారు అంటే కంగనా రనౌత్ పేరు అందరికంటే ముందు వినిపిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుకు వచ్చి మాట్లాడడంలో కంగనా రనౌత్ ను మించిన వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు. ప్రతి విషయంలోనూ ఆమె స్పందిస్తూ ఉంటుంది. అది కొంతమందికి అస్సలు నచ్చదు. అందుకే ఇండస్ట్రీలో ఈమెకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అంతేకాదు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది కంగనా రనౌత్. దాంతో వాళ్లు కూడా ఈమెపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటూ అభిమానులు మండి పడుతున్నారు.
కావాలనుకుంటే కంగనా అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ ఆమెను పర్సనల్ గా టార్గెట్ చేయడం ఏమిటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈమె కూడా ఇదే చెబుతుంది. తనను మహారాష్ట్ర ప్రభుత్వం కావాలనే వేధిస్తుంది అంటూ వాపోయింది కంగనా రనౌత్. తన పాస్ పోర్ట్ విషయంలో ప్రభుత్వం పరోక్షంగా వేధింపులకు గురి చేస్తుందని ఈమె తెలిపింది. అసలు ఎవరో తెలియని వ్యక్తి పెట్టిన ఒక తప్పుడు కేసు కారణంగా చూపించి పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి అధికారులు తిరస్కరిస్తున్నారు అంటూ ఆమె మండిపడుతోంది.
ఇదే విషయంపై కోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా తనకు అన్యాయం జరిగిందని.. అప్లికేషన్ అస్పష్టంగా ఉంది అంటూ జూన్ 25కి విచారణ వాయిదా వేసినట్లు తెలిపింది కంగనా. గతంలో అమీర్ ఖాన్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఎందుకు ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ ఆపలేదని.. షూటింగ్ ఎందుకు నిలిపి వేయలేదని ఆమె ప్రశ్నించింది. తన విషయంలో మాత్రమే ఎందుకు ఇలా కక్ష సాధిస్తున్నారు.. ఇలా వేధిస్తున్నారు అంటూ ఆమె మండిపడుతుంది. ప్రస్తుతం ఈమె తేజస్ సినిమా కోసం బుడాపెస్ట్ కు వెళ్లాల్సి ఉంది. కానీ పాస్ పోర్ట్ రెన్యువల్ ఆగిపోవడంతో షూటింగ్ కూడా ఆలస్యం అవుతుంది.