Kamal Hassan | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న తరుణంలో భారతీయ సినీ పరిశ్రమ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని విశ్వనటుడు కమల్ హాసన్ సూచించారు. సినిమా నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలు తగ్గించి, ఖర్చుల విషయంలో మరింత క్రమశిక్షణ పాటించాలని కోరుతూ ఆయన ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, రవాణా వ్యయాలు, వాణిజ్య రంగంలో నెలకొంటున్న ఒత్తిడి ప్రభావం భారతదేశంపైనా పడుతోందని కమల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సినిమా నిర్మాణ వ్యయాలు పెరిగిన పరిస్థితుల్లో, తాజా ప్రపంచ పరిణామాలు మరింత భారం మోపే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావం కేవలం నిర్మాతలకే పరిమితం కాకుండా, ప్రేక్షకుల వినోద ఖర్చులపై కూడా ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో ఖర్చులు తగ్గించే పేరుతో క్షేత్రస్థాయి కార్మికులపై భారం వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలు, భద్రత, ఆహారం, వసతి, రవాణా వంటి ప్రాథమిక అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించరాదన్నారు. సినిమా కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి నాణ్యతను పెంచేదిగా ఉండాలని, కేవలం పైపై హంగుల కోసం కాకూడదని సూచించారు. సినిమా నిర్మాణంలో అనవసర ఖర్చులు, భారీ మేనేజ్మెంట్ వ్యవస్థలు, షూటింగ్ ఆలస్యాలు, విదేశీ ప్రయాణాలపై కూడా కమల్ స్పందించారు. ప్రతి ప్రేమకథ విదేశాల్లోనే చిత్రీకరించాల్సిన అవసరం లేదని, దేశంలోనే అద్భుతమైన లోకేషన్లు, ప్రతిభ అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. భారతీయ వనరులు, స్థానిక ప్రతిభపై మరింత నమ్మకం పెరగాలని పిలుపునిచ్చారు.
అలాగే షూటింగ్లకు ఖచ్చితమైన షెడ్యూల్స్, సమయపాలన ఉండాలని, సెట్స్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణ విధానాలను అవలంబించాలని సూచించారు. వాడిన మెటీరియల్స్ను తిరిగి ఉపయోగించడం వంటి చర్యలపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బడ్జెట్ను మాత్రమే సినిమా స్థాయిగా భావించడం సరైన పద్ధతి కాదని కమల్ అభిప్రాయపడ్డారు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు భారీ ఖర్చులతో కాకుండా, బలమైన కథ, క్రమశిక్షణతో రూపొందాయని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు, దర్శకులు, నటులు, స్టూడియోలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, యూనియన్లు కలిసి పరిశ్రమ భవిష్యత్తుపై చర్చించాలని కమల్ హాసన్ సూచించారు. నేటి నిర్ణయాలే రేపటి సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన స్పష్టం చేశారు.