నటనకు కొత్త నడతను నేర్పించి భారతీయ సినిమాను ప్రయోగాల బాట పట్టించారు విలక్షణ నటుడు కమల్హాసన్. కథాంశాల్లో నవ్యతకు, పాత్ర పోషణలో వైవిధ్యానికి చిరునామాగా ఆయన్ని అభివర్ణిస్తారు. అర్ధ శతాబ్దంపైగా సినీ ప్రస్థానాన్ని సాగిస్తున్నా..ఇప్పటికీ అదే ఉత్సాహంతో వెండితెరపై నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటారాయన. కమల్హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. స్వీయ నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ నిర్మించారు. శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో ఈ నెల 3న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా కమల్ హాసన్ పాత్రికేయులతో ప్రత్యేకంగా సంభాషించారు. చిత్ర విశేషాలతో పాటు సమకాలీన సినీరంగంలో వస్తున్న మార్పులపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
ఇటీవల మీ మిత్రుడు రజనీకాంత్ను కలుసుకున్నారు. మీ మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి?
నలభై ఏళ్ల స్నేహబంధం మాది. అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం. అయితే చాలా కాలం విరామం తర్వాత మేమిద్దరం కలుసుకోవడంతో అదొక పెద్ద వార్తలా అయిపోయింది (నవ్వుతూ). మా ఇద్దరి భేటీలో సినిమాలకు సంబంధించిన విషయాలే చర్చకు వచ్చాయి.
రాజకీయ అంశాల గురించి ఏమైనా మాట్లాడుకున్నారా?
అలాంటిదేమీ లేదు. రాజకీయంగా మా ఇద్దరి ఆలోచనలు, విశ్వసించే భావజాలాలు పూర్తి వేరుగా ఉంటాయి. రాజకీయాల కంటే నేను స్నేహానికే ఎక్కువ విలువిస్తాను. మా ఇద్దరి మధ్య రాజకీయాల ప్రస్తావన ఎప్పుడూ రాదు.
అడవిలో వేట అంటూ సినిమా ట్రైలర్లో చూపించారు. ఇంతకి ‘విక్రమ్’ సినిమా ఎలా ఉండబోతున్నది?
ప్రస్తుతం మన నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయాయి. ఇక్కడ కూడా వేటగాళ్లు పొంచి ఉంటారు. వారి వేటుకు బలైపోయే బాధితులూ ఉంటారు. ‘విక్రమ్’ సినిమాలో డ్రగ్స్..వాటి చుట్టూ అల్లుకున్న మాఫియా నెట్వర్క్ గురించి చర్చించాం. ఓ వికృత క్రీడలో మన ప్రమేయం లేకుండానే ఎలా బాధితులుగా మిగిలిపోతున్నామనే బలమైన అంశాల్ని తెలియజెప్పాం.
కథలో కొత్తదనం ఉంటేనే సినిమాల్ని ఒప్పుకుంటారు. విక్రమ్ కథాంశంలో మీకు నచ్చిన అంశాలేమిటి?
ఈ రోజుల్లో కథ బాగా కుదరడం..ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడం రెండూ కష్టంగా మారాయి. మంచి సినిమాలు తీస్తే ఆడవనే నమ్మకం పెరిగిపోయింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ధైర్యంగా సినిమాలు తీసే బాలచందర్, విశ్వనాథ్లాంటి దర్శకులు నేటి రోజుల్లో కనిపించడం లేదు.
భాషా భేధాలు లేకుండా ఇండియన్ సినిమా అని పిలవడమే ఇష్టమని మీరు ఎప్పుడూ చెబుతుంటారు..?
ఇండియన్ సినిమా అనుకుంటేనే బాగుంటుంది. ఒకప్పుడు చైన్నై దక్షిణాది భాషా చిత్రాలకు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్ ఆ స్థాయిని సంతరించుకుంటున్నది. రాబోయే రోజుల్లో నేషనల్ ఫిల్మ్ మేకింగ్ హబ్గా హైదరాబాద్ మారిపోతుందనుకుంటున్నా. అందుకు తగిన అన్ని హంగులు, అర్హతలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయి.
ప్రస్తుతం ఓటీటీ విప్లవం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
థియేటర్ను చౌరస్తాలోని ఎత్తైన క్లాక్టవర్తో పోల్చవచ్చు. ఓటీటీ చేతికి పెట్టుకునే వాచ్ లాంటిది. ఈ రెండింటిలో సమయాన్ని చూసుకోవాలి (నవ్వుతూ). ఇంట్లో తిరుపతి క్యాలెండర్ ఉంటే సరిపోదు కదా? గుడికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే వచ్చే అనుభూతి అనిర్వచనీయం.
‘భారతీయుడు-2’ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని మీరే తీసుకోబోతున్నారా?
నేను మరిన్ని సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రతిభావంతులైన కొత్త దర్శకులతో పనిచేస్తే నా ప్రతిభను మరింతగా ఉన్నతీకరించుకోవచ్చని భావిస్తున్నా. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలనే సన్నాహాల్లో ఉన్నాం.
తొలితరం అగ్ర నిర్మాత నాగిరెడ్డిగారు తన విజయవాహిని బ్యానర్పై తెలుగు, తమిళం, హిందీ సినిమాల్ని తీశారు. అలాగే ఏవీఎమ్ వారు కూడా ‘చంద్రలేఖ’ వంటి తొలి పాన్ ఇండియా సినిమాను అందించారు. నా దృష్టిలో దక్షిణాది వారు ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు తీశారు. రామానాయుడుగారిని తీసుకుంటే ఆయన అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీశారు. దక్షిణాది వారు ఆ రోజుల్లోనే పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్గా రాణించారు.
ఓటీటీ లాంటి కొత్త మాధ్యమాల్ని స్వాగతించడం కొత్తలో ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. పిజ్జా తిన్నంత మాత్రాన..మన ఉలవచారును మర్చిపోలేం కదా? సినిమాల్ని వీక్షించడానికి ఎన్ని మాధ్యమాలు పుట్టుకొచ్చినా థియేటర్కు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది.