తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో,కాళోజీగా మూలవిరాట్ నటించారు. జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రభాకర్ జైనీ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘కాళోజీ జీవించిన, ఆయన తిరిగిన ప్రదేశాల్లో వరంగల్,కరీంనగర్, హైదరాబాద్లో చిత్రీకరణ చేశాం.
కాళోజీ సన్నిహితులను,బంధువులను, మిత్రులను కలిసి ఆయన గురించి సేకరించిన వివరాలను సినిమాలో పొందుపరిచాం. కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని..వారి జీవితం స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నాను. తప్పకుండా ఈ చిత్రం అందరి మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్ ఆత్రేయ.