విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. డాక్టర్ కందుల ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మాతలు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం సీనియర్ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. హీరో విశ్వకార్తికేయ తండ్రి రామానుజంతో తనకు ఎన్నో ఏళ్లుగా చక్కటి అనుబంధం ఉందని, ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకురావాలని సుమన్ ఆకాంక్షించారు.
తాను పుట్టిన ఊరిని తెరపై చూసుకోవాలని కోరిక ఈ సినిమాతో తీరిందని, కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించానని నిర్మాత కందుల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి అద్భుతమైన కథ కుదిరిందని, ఈ సినిమాలోని సందేశం నేటి యువతరాన్ని ఆలోచింపజేస్తుందని దర్శకుడు రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.