Cinema News | ‘ప్రస్తుతం చాలామంది తండ్రులు సోషియో ఫోబియోతో ఉన్నారు. పిల్లల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా, నా కొడుకు ఇలా ఉండాలి.. అలా చేయాలి అని ఊహల్లో బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం మా ‘కలియుగపట్టణంలో’ అన్నారు దర్శకుడు రమాకాంత్రెడ్డి. విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి డాక్టర్ కందుల చంద్రఓబుల్రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ నిర్మాతలు. ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం దర్శకుడు రమాకాంత్రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. కలియుగంలో మనుషుల పోకడలు ఎలా ఉంటున్నాయో చూపించే ప్రయత్నం ఈ సినిమా అని, ఈ కథలో చక్కని సందేశంతోపాటు తల్లి సెంటిమెంటూ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని దర్శకుడు చెప్పారు.
ఇంకా చెబుతూ ‘నా జీవితంలో నేను చూసిన సంఘటనల ఆధారంగా ఈ కథ తయారుచేసుకున్నాను. ఇందులో మంచి సందేశం ఉంది. సినిమాను కొందరు సినీపెద్దలకు వేసి చూపించాం. అందరికీ నచ్చింది. కథ, కథనాలేకాదు.. సాంకేతికంగా కూడా సినిమా బావుందని మెచ్చుకున్నారు. అజయ్ అరసాద సంగీతం, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి గొప్ప సంస్థ మా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు దర్శకుడు రమాకాంత్రెడ్డి.