ప్రస్తుతం దేశంలో రూపొందుతున్న భారీ చిత్రాల్లో అత్యంత భారీ సినిమా ఏది? అనంటే ఠక్కుమని వచ్చే సమాధానం ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై దాదాపు మూడువేల కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. రావణ పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటిస్తుండగా, రావణుడి భార్య మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తున్నట్టు ఇన్నాళ్లూ వార్తలొచ్చాయి.
తాజాగా ఈ విషయాన్ని కాజల్ కూడా ధృవీకరించింది. ఓ అవార్డు వేడుకకు హాజరైన కాజల్ ‘రామాయణ’ గురించి మాట్లాడుతూ “రామాయణ’లో మండోదరిగా నటిస్తున్నాను. నా కెరీర్లో ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ చేయడం ఇదే ప్రథమం. అందరిలాగే ఈ సినిమా కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అన్నారు కాజల్. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నారు.