‘ది ఇండియా స్టోరీ’ కథ విని షాక్ అయ్యాను. అసలు మనం ఏం తింటున్నాం? ఇలా కల్తీ ఆహారం తింటే మన కుటుంబాల పరిస్థితేంటి? అని తలచుకుంటే రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది నటి కాజల్ అగర్వాల్. ఆమె ప్రధానపాత్ర పోషించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆహార కల్తీ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు.
కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ లాయర్గా నటించారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమా విడుదల కానున్నది. ఈసందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘ఆహారంలో కల్తీ గురించి విన్నాను కానీ, మరీ దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాలో నటించాక అర్థమైంది. ఆ నిజాలు నన్నెంతో భయపెట్టాయి. వాస్తవానికి అద్దం పట్టే ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.