Jyothika | దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన ఆమెకు 27 ఏళ్ల కెరీర్లో ఒక్క హిందీ సినిమా ఆఫర్ కూడా రాలేదని వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1998లో విడుదలైన ‘దోలి సజా కె రఖ్నా’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన జ్యోతిక, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం ఆమె దక్షిణాది చిత్రసీమ వైపు అడుగులు వేసి, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అనేక సూపర్ హిట్, బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే అంతటి స్టార్డమ్, విజయాలు సాధించినప్పటికీ బాలీవుడ్ నుంచి తనకు అవకాశాలు రాకపోవడం వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక వెల్లడించారు. గత 27 ఏళ్లలో ఒక్కసారి కూడా హిందీ సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. చాలా మంది నేను బాలీవుడ్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని భావించి ఉండొచ్చు. కానీ నిజానికి నాకు ఒక్క స్క్రిప్ట్ కూడా రాలేదు అంటూ జ్యోతిక ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘సైతాన్’, ‘డబ్బా కార్టెల్’ వంటి హిందీ ప్రాజెక్ట్లతో బాలీవుడ్లో మళ్లీ కనిపిస్తున్న జ్యోతిక, తనకు అవకాశాలు రావడం వెనుక మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. తాను ముంబైకి మకాం మార్చిన తర్వాతే హిందీ అవకాశాలు రావడం ప్రారంభమైందని చెప్పారు.
అయితే బాలీవుడ్లో కెరీర్ను కొనసాగించాలనే ఉద్దేశంతో తాను ముంబైకి వెళ్లలేదని, తన పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం అక్కడికి షిఫ్ట్ అయ్యానని జ్యోతిక తెలిపారు. “ముంబైకి వచ్చిన తర్వాత అనుకోకుండా హిందీ ప్రాజెక్ట్లు రావడం మొదలైంది” అని ఆమె పేర్కొన్నారు. ఇక ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమల మధ్య గతంలో ఉన్న దూరం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని జ్యోతిక అభిప్రాయపడ్డారు.నార్త్, సౌత్ ఇండస్ట్రీల మధ్య ఉన్న గీతలు చెరిగిపోయాయి. రెండు పరిశ్రమలు ఇప్పుడు మరింత దగ్గరయ్యాయి. అందుకే ప్రస్తుతం నాకు హిందీ ప్రాజెక్ట్లు వస్తున్నాయని నేను భావిస్తున్నాను అని ఆమె చెప్పారు. జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రాంతీయ భాషలకే పరిమితమైన నటీనటులు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.