‘అతిథిగా వచ్చిన సూర్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేం లేదు. నటుడిగా ఆయనేంటో అందరికీ తెలుసు. ఇక నవీన్చంద్ర.. ‘తను ఇలా కూడా చేస్తాడా?’ అన్నంత గొప్పగా చేశాడు. ఇందులో తన పాత్ర పేరు శివుడు. తెరపై తనను చూసి షాక్ అవుతారు. శ్రీలీల నా లక్కీ హీరోయిన్. ఇందులో మాస్ క్యారెక్టర్ ఇరగదీసింది. నిర్మాత నాగవంశీ అస్సలు ఖర్చుకు వెనుకాడలేదు. భాను కచ్చితంగా మంచి దర్శకుడవుతాడు. సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. పేరుకు తగ్గట్టు అక్టోబర్ 1న థియేటర్లలో ‘మాస్ జాతరే’.’ అని అగ్ర హీరో రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన మాస్ ఎంటైర్టెనర్ ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్ 1న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్య మాట్లాడుతూ ‘రవితేజను చూడగానే ఇరవై ఏళ్లు వెనక్కెళ్లి, ఫ్యాన్ బోయ్ని అయిపోయా. ఎనర్జీకి మరో రూపం ఆయన. సామాన్యుడ్ని తెరపై కింగ్లా చూపించే హీరో తను. ఆయన సినిమాలన్నీ అద్భుతాలే. రవితేజ ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని కార్తీ ‘చిరుతై’గా చేశాడు. తన కెరీర్కి అది టర్నింగ్ పాయింట్. రేపు థియేటర్లలో కచ్ఛితంగా రవితే‘జాతర’ ఖాయం.’ అని నమ్మకంగా చెప్పారు. ఇంకా శ్రీలీల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు భాను భోగవరపు, నవీన్చంద్ర, డా.రాజేంద్రప్రసాద్, భీమ్స్ సిసిరోలియో, శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు తదితురులు కూడా మాట్లాడారు.