ధడక్, గుంజన్ సక్సేనా, గుడ్లక్ జెర్రీ చిత్రాలతో బాలీవుడ్లో ప్రతిభావంతురాలైన నాయికగా పేరు తెచ్చుకుంది దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్. కథాంశాల పరంగా వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నదీ భామ. ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది జాన్వీకపూర్.
తాను సినిమాల్లో వస్తానంటే అమ్మ ఎంతగానో వారించిందని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని హెచ్చరించిందని పేర్కొంది. ‘నేను సినిమాల్లోకి వెళ్లడం అమ్మకు అస్సలు ఇష్టం లేదు. తాను కొన్ని దశాబ్దాల పాటు సినిమానే ప్రపంచంగా భావించానని, కుటుంబానికి ఏమాత్రం సమయం కేటాయించలేకపోయానని అమ్మ ఎప్పుడూ బాధపడేది.
నాకూ అలాంటి ఇబ్బందులొస్తాయని అమ్మ సినిమాలు వొద్దని చెప్పింది. కొంతకాలం సినిమాలు చేసిన తర్వాత ఫ్యామిలీ కోసమే సమయాన్ని కేటాయిస్తానని అమ్మకు మాటిచ్చి సినీ రంగంలోకి వచ్చాను’ అని జాన్వీ కపూర్ చెప్పింది.