Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తొలి చిత్రం ‘ధడక్’ తోనే అందరినీ ఆకర్షించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న జాన్వీ.. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీదేవి బయోపిక్పై స్పందించింది.
ఇంటర్వ్యూలో భాగంగా శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తే అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నారా ? అని విలేకరి ప్రశ్నించగా.. దీనికి జాన్వీ వెంటనే లేదు అని సమాధానమిచ్చింది. ఇందుకు కారణం చెప్పాలని కోరగా.. ‘‘సమాధానం చాలా పెద్దగా ఉంటుంది.. ప్రస్తుతం నేను ఈ స్టేజిపై ఏడవాలనుకోవడం లేదు’’ అని బదులిచ్చింది.
అనుకోని పరిస్థితుల్లో మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కినచిత్రం ‘మిలీ’. ఈ చిత్రంలో జాన్వీ మిలీ నౌదియల్గా కనిపించనున్నారు. మలయాళ చిత్రం ‘హెలెన్’కు రీమేక్గా ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. సన్నీ కౌశల్, మనోజ్ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ ఈ సినిమాకు దర్శకుడు.