N. Shankar | టాలీవుడ్ దర్శకుడు ఎన్. శంకర్ (N Shankar) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఎన్కౌంటర్, ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘ఆయుధం’, ‘భద్రాచలం’, జై భోలో తెలంగాణ’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఎన్.శంకర్ వెబ్ సిరీస్లతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎన్.శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో’(N Shankar Tv and Film Studio) బ్యానర్లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో చారిత్రాత్మక కధాంశాలతో రూపొందనున్న మూడు వెబ్సీరీస్ల విశేషాలు గురించి ఎన్.శంకర్ తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Saayudha Poratam | తెలంగాణ సాయిధ పోరాటంలో ప్రజలే సైనికులుగా యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థలో సామాన్యుల మీద జరిగిన దాడులు.. ప్రజలు, ముఖ్యంగా మహిళల ప్రతిఘటన మొదలుకుని, తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్లో కలపబడటం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత జరిగిన పరిణామాలు, పాలకుల నిర్ణయాలు.. రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రజల తరఫున ఉద్యమాలు, విప్లవపార్టీల భావజాలంతో పాటు, ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన పోరాటాల కొనసాగింపుగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, జరిగిన పోరాట నేపథ్యంలో జరిగిన ఎన్నో ఉద్యమాలు, వాటిలో జరిగిన ఆటుపోట్లు గురించి.. ప్రజల కోణంలో అర్థవంతంగా, చూపించాలనే సంకల్పంతో ఈ వెబ్సీరీస్కు శ్రీకారం చుడుతున్నాం. దీనికి సంబంధించిన షూటింగ్ పనులు అక్టోబర్ నుంచి మొదలవుతుంది.
మహాత్మ జ్యోతీరావు పూలే అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు (ఆయన బయోగ్రఫీ కాదు) పేదలకు, మహిళలకు విద్యను భోదించటం కోసం, తన సతీమణి సావిత్రిబాయి గారి ద్వారా తన సంకల్పానికి శ్రీకారం చుట్టి, ఆనాటి దురాచారాల పట్ల తిరుగుబాటు చేసిన క్రమంలో, ఆయన ఎదుర్కొన సమస్యలు, అవమానాలు, త్యాగాలు, ఆయన చేసిన భోదన కథాంశంగా రెండవ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
ఇది బాబా సాహెబ్ అంబేద్కర్ బయోగ్రఫీ కాదు. ఆయన ఈ దేశానికి , అట్టడుగు ప్రజలకు, అణగారిన వర్గాలకు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన బాధలను, తన ధృడ సంకల్పం, వ్యక్తి నుండి వ్యవస్థగా తను మారడానికి మద్య జరిగిని సంఘర్షణలు ఇతి వృత్తంగా మూడో వెబ్ సిరీస్ వర్క్ జరుగుతుంది.
అవి బయోగ్రఫీలు కావు: శంకర్
మహాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డా.బాబాసాహెబ్ అంబేద్కర్ల వెబ్ సిరీస్లు వారి బయోగ్రఫీలు కాదు. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, ప్రజల పట్ల వాళ్లకున్న కమిట్మెంట్, సమాజంలో సమానతల కోసం వారు చేసిన నిజాయితీ పోరాటం, వారి నిజ జీవితంలో జరిగిన సంఘర్షణలు, అవమానాలు, గౌరవాలు, ఇలా అన్ని ఈ తరం వారికి తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ వెబ్సిరీస్లు చేస్తున్నాం. ఈ మూడు వెబ్సీరీస్లను కూడా పూర్తి ఆసక్తికరంగా వుండే విధంగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తాం. మూడు సంవత్సరాల నుండి మా టీమ్తో కలిసి ఈ కథలపై వర్క్ చేస్తున్నాం. పూర్తి వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తాం అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఎన్. శంకర్.