Tapsee Pannu | తన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలు ఒత్తిడికి గురి చేస్తున్నాయని అంటున్నది బాలీవుడ్ నాయిక తాప్సీ పన్ను. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తాననే పేరును కాపాడుకుంటూనే నట ప్రయాణం కొనసాగిస్తానని…అయితే అన్నిసార్లూ సంతృప్తిపరచడం సాధ్యం కావడం లేదని ఆమె చెబుతున్నది. ‘ఛష్మే బద్దూర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన తాప్సీ…‘బేబీ’, ‘బదా’్ల, ‘నామ్ షబానా’, ‘శభాష్ మిథు’ వంటి నాయిక ప్రధాన చిత్రాలతో తన ప్రత్యేకత చాటుకుంది.
ఇటీవల నిర్మాతగా మారి ‘బ్లర్’, ‘ధక్ ధక్’ అనే రెండు చిత్రాలను నిర్మించింది. తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ…‘నా సినిమాల్లో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ అంచనాలు నన్ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రతిసారీ మిమ్మల్ని సంతృప్తిపరచడం సాధ్యం కావడం లేదు. అయినా వినూత్న కథల్లో నటించాలనే నా ఆలోచనలు మార్చుకోను’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘ఏలియన్’, ‘వో లడ్కీ హై కహాన్’, ‘ఫిర్ ఆయే హసీన్ దిల్రూబా’, ‘జనగణమన’, షారుఖ్ ఖాన్ సరసన ‘డంకీ’ వంటి చిత్రాలున్నాయి.