షారుఖ్ఖాన్ హీరోగా తెరపై కనిపించి నాలుగేండ్లవుతున్నది. 2018లో ‘జీరో’లో నటించాక మళ్లీ సినిమా చేయలేదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవడం వల్లే కథలు ఎంచుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి. హీరోగా నటించకున్నా రెండు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు షారుఖ్. ఇక ఈ లోటును తీర్చేందుకు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారాయన. షారుఖ్ నటిస్తున్న ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ సినిమాలు రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది సీజన్కు ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
‘పఠాన్’ జనవరి 25న, ‘జవాన్’ జూన్లో, ‘డంకీ’ డిసెంబర్లో విడుదల కాబోతున్నాయి. ఇటీవల 30 రోజుల పాటు ‘జవాన్’ సినిమా కోసం చెన్నైలో షూటింగ్ చేశారు షారుఖ్. నయనతార ఇందులో నాయిక. ‘పఠాన్’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో దీపికా పడుకోన్ షారుఖ్ సరసన మెరవనుంది. సినిమా నుంచి సినిమాకు మారుతున్న ఈ స్టార్ ఆదివారం ముంబైలో ‘డంకీ’ షూటింగ్లో పాల్గొన్నారు. 500 మందితో రేస్ సీక్వెన్సులు చిత్రీకరించారు. రాజు హిరాణీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వలసల నేపథ్యంతో రూపొందుతున్నది.