Irumudi | మాస్ మహారాజా రవితేజకు కొంతకాలంగా సరైన విజయం దక్కడం లేదు. ముఖ్యంగా ‘ధమాకా’ తర్వాత వచ్చిన వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో ఆయన మార్కెట్పై కూడా ప్రభావం పడింది. తనకు బాగా కలిసొచ్చిన మాస్ కమర్షియల్ జానర్కు కాస్త భిన్నంగా ఈసారి ఆధ్యాత్మిక కథాంశాన్ని ఎంచుకున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషన్స్, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిన ‘ఇరుముడి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా.. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రవితేజ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
‘ఇరుముడి’ తొలి రోజు ఏకంగా రూ.24.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందులో ఇండియాలో రూ.17.20 కోట్ల గ్రాస్, రూ.14.80 కోట్ల నెట్ రాగా.. ఓవర్సీస్ నుంచి సుమారు రూ.7 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది రవితేజ సోలో హీరోగా నటించిన సినిమాల్లోనే అత్యధిక ఓపెనింగ్గా నిలిచింది. ఇప్పటివరకు ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు తొలి రోజు సుమారు రూ.8 కోట్ల స్థాయిలో ఓపెనింగ్స్ సాధించగా.. ‘ఇరుముడి’ వాటిని భారీ తేడాతో అధిగమించినట్లు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు చూపించింది. ఈ ఏడాది విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’ అడ్వాన్స్ బుకింగ్స్లో సుమారు 31.6 వేల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ‘ఇరుముడి’ విడుదలకు ముందే 32.25 వేల టికెట్లను అడ్వాన్స్గా విక్రయించి ఆ రికార్డును దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రవితేజ కెరీర్లో ఇలాంటి ఓపెనింగ్ రావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత ఒక భిన్నమైన కథతో వచ్చి ఇంతటి రెస్పాన్స్ అందుకోవడం విశేషంగా మారింది. ‘ఇరుముడి’ చిత్రానికి సుమారు రూ.40 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.20 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులు రూ.5.50 కోట్లు, సీడెడ్ రూ.2.25 కోట్లు, ఆంధ్రా రూ.8.25 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో రూ.4 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.21 కోట్ల షేర్ రావాల్సి ఉంటుందని అంచనా. తొలి రోజు వసూళ్లు, పాజిటివ్ టాక్ను చూస్తుంటే ఈ టార్గెట్ను త్వరగానే అందుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవితేజ కెరీర్లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ఇప్పటివరకు ‘ధమాకా’ నిలిచింది. ఇప్పుడు ‘ఇరుముడి’కి తొలి రోజు నుంచే వస్తున్న స్పందన, వరుస సెలవులు కలిసిరావడంతో ఈ సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్లోకి వెళ్లే అవకాశాలపై చర్చ మొదలైంది.