‘టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. రేణూదేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో ముచ్చటించారు.
‘కథ డిమాండ్ మేరకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి పేషన్తో ఈ సినిమా చేశాం. ఒక దొంగ బయోపిక్ ఎందుకు తీశారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ దొంగలో ఎంతో ఉన్నతమైన కోణముంది. అది రేపు తెరపై చూస్తారు. దీన్ని అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ నేనొప్పుకోను. ఇప్పుడు సినిమా అంతా ఒకే వేదికపైకి వచ్చింది. కాబట్టి ఇది కేవలం ఇండియా సినిమా. అన్ని రాష్ర్టాల్లో బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా విషయంలో లీగల్గా ఎదురైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. మా సంస్థ పేరును మరింత పెంచే సినిమా అవుతుంది’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు.