సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజ యోగం’. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు రామ్ గణపతి. ఆయన మాట్లాడుతూ..‘నేను ఇ..ఈ అనే చిత్రాన్ని గతంలో రూపొందించాను. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగు సినిమా ఫార్మేట్లో తెరకెక్కించాను. అయితే అది విజయం సాధించలేదు. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే మథనం నాలో ప్రారంభమైంది. చిన్న చిత్రాల వైపు ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే ఏదో ఒక ప్రత్యేకత కావాలి. అందుకే రొమాంటిక్ క్రైమ్ కామెడీ జానర్ను ఎంచుకున్నాను. యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నా…ఎక్కడా అసభ్యత ఉండదు. పది వేల కోట్ల రూపాయల విలువైన వజ్రాల కోసం జరిగే వేట ఈ సినిమా. కథకు తగినట్లు హీరో హీరోయిన్లతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు దొరికారు. హీరో సాయి రోనక్ ఫైట్స్, డ్యాన్సులు బాగా చేస్తాడు. అయితే అతని ప్రతిభను చూపించే సినిమా రాలేదు. ఇందులో సాయి రోనక్ను కొత్తగా చూస్తారు. ఈ సినిమా ప్రివ్యూలు చూసిన వారంతా బాగుందని చెప్పారు. సెన్సార్తో సహా అందరూ వినోదాన్ని అందించామని అన్నారు. ఈ సినిమా చూసిన వాళ్లంతా తమ స్నేహితులకు ఫోన్ చేసి వారినీ చూడమంటారు.’ అని అన్నారు.